Friday, May 9, 2014

My Article "Mundu Evaru Maaraali..." published in Andhrabhoomi Daily Bhoomika's Mainfeature on 08.05.14.

Online Link: http://www.andhrabhoomi.net/content/first-whos-change 

మేం మారితే సరిపోతుందా? మిగతావారి సంగతేంట’ని ప్రశ్నించేవారే గానీ
ఒక తప్పుని ప్రశ్నించేవారు తక్కువ. తప్పుకుని తిరిగేవారే ఎక్కువ. తాను కోల్పోయిందే పక్కవారూ కోల్పోవాలి, తాను పొందింది మాత్రం పక్కవారికి దక్కకూడదు అనే స్వార్థపూరిత ధోరణి మారనంతవరకు మనమింతేనా...?
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉదయం లేవగానే చూసిన ప్రతీది, చేసే ప్రతీది ‘మారాలి.. మారాలి..’ అని లేదా మార్చుకోవాలని రోజూ మనం పదే పదే కోరుకుంటాం. కానీ- అసలు ఏం మారాలో, ఎందుకు మారాలో తెలిసినా అమలు చేయలేని పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయనే సం దేహం వెంటాడుతుంది. ఉదాహరణకి అన్ని ప్రభు త్వ ఆసుపత్రుల్లో ‘మా సిబ్బంది ఎవరైనా మి మ్ములను డబ్బులు అడిగితే ఫలానా ఫోన్ నెంబరులో మమ్మల్ని సంప్రదించి మాకు తెలి యపరచగలరు’ అనే ప్రకటన కనపిస్తుంది. నిజానికి ఎంతమంది ఆ ప్రకటన చదివి అమలు పరుస్తారు? అది చూసిన తరువాత కూడా సిబ్బంది డబ్బులు అడగడం, సామాన్యులైనా, సంపన్నులైనా, ఇంకెవరైనా సరే కళ్లు మూసుకుని డబ్బులిచ్చేస్తాం. ‘సిబ్బందికి డబ్బులివ్వకపోతే వారు జబ్బు పడిన మా అమ్మాయిని సరిగా చూడరు, పిలిచిన ప్రతిసారీ విసుక్కుంటారు, పైవారికి చెబితే ఇంకా కోపంతో అసలు పట్టించుకోరు, ఉన్న నాలుగు రోజులు వారు మాకు సహకరించాలంటే ఇలా చాయ్ పైసలు ఇవ్వాల్సిందే, తప్పదు’- అని ఓ తల్లి బాధపడుతుంది. ఇలాంటి వారు ఇంకా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ‘చేతి చమురు’ వదిలించుకోక తప్పదు. మారాలని కోరుకునే సామాన్య జనమే మార్పుకి భయపడుతుంటే- ఇక మార్పు ఎలా సాధ్యం?
రోజూ మనం రోడ్డుపై అడుక్కునేవారిని చూ స్తుంటాం. అసలు వీరికి ప్రభుత్వం ఎన్నో ఆశ్రమాలు నిర్మించి, వసతులు కల్పించినా వారు అక్కడ ఉండడానికి నిరాకరిస్తారు, స్వతంత్ర జీవనానికి అల వాటుపడ్డవాళ్లు అక్కడ ఉండలేక మళ్లీ అడుక్కుంటూనే సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అడుక్కోవడం తప్పని తెలిసినా వారు మానడం లేదు. పైగా అడుక్కునే ముసుగులో ఎందరో సంపాదనపరులున్నారు, దం దాలు చేసేవారు ఉన్నారు. అడుక్కోవడం కూడా ఒక వ్యాపారం కావడానికి పరోక్షంగా మనమే కారణం అని తెలిసినా సరే కొందరు సానుభూతితో డబ్బు వేస్తారు, కొందరు తమ డాబు చూపించుకోవడానికి వేస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ముందు మారాలి? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. రాను రాను ఫిర్యాదు చేసేవారు కూడా కరవవుతారేమో! అసలు మారాలి, మార్పు రావాలి అనే తపన చచ్చిపోయి, మారినా, మారకపోయినా ఫరవాలేదు అనే స్థితికి సమాజం మారిపోతుందేమో?
ఆ మధ్య టీవీలో ప్రసారమైన ‘సత్యమేవ జయతే- 2’లో ఒక అధికారి మాట్లాడుతూ, హర్యానాలో పోలీసులకు ఫోన్‌కాల్ ద్వారా అందే ఫిర్యాదుల సంఖ్య ‘సున్నా’ అని, అదే కేరళలో రోజుకు వంద చొప్పున నెలకు ముప్ఫైవేలుగా చెప్పుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే నేరాల సంఖ్య కేరళలో లక్ష కాగా, హర్యానాలో సున్నా. ఇలాంటి సంగతులు విన్న తరువాత అసలు ప్రజలకు ఈ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉందో అంచనా వేయొచ్చు. అసలు ఫిర్యాదు ఇవ్వడమే వృథా అనే భావనలో అందరం ఉన్నామని నమ్మాల్సిందే. ఫిర్యాదు ఇచ్చి సమయం వృథా చేసుకునేకన్నా సర్దుకుపోయి పని జరిగేలా చూసుకోవడం మంచిదని, అందుకు అవసమైతే కొంత డబ్బు ఖర్చైనా ఫర్వాలేదని అందరూ భావిస్తున్నారు.
కొత్తగా అరంగేట్రం చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు అతని బాధ ఇలా చెప్పుకున్నాడు- ‘అసలు ఓటు వేయడానికి నోటు ఇవ్వడం మాకు సరదానా? మా దగ్గర నిజంగా అంత డబ్బు లేదు. అప్పు చేసి మరీ పంచుతున్నాం. ఓటరుని మెప్పించడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు’’ అని. ఇదే ప్రశ్న ఓటరుని అడిగితే ‘‘ఎవరికి ఓటు వేసినా ఇంతే, అంతా రాజకీయాలకొచ్చి సంపాదించుకుంటారు తప్ప సమాజానికి చేసేది ఏమీ లేదు. అందుకే ఓటుమీద ఆసక్తి, నమ్మకం రెండూ లేవు. ఇక వారు ఇచ్చే డబ్బు మాకు చిన్న ఆశ, ఆసరా’’ అని.
ఒక పనిమనిషిని ‘‘నువ్వెందుకు నాలుగు రోజులు పనికి రాలేదు’’ అని అడిగితే, ‘‘మా ఊరిలో ఎన్నికల సభకు వెళ్తున్నా, దారి ఖర్చులు, భోజనం అన్నీ వారే ఇస్తారు’’ అంది. మరి ఇక్కడ పని పోతుంది కదా, నీ జీతం నాలుగు రోజులు కూడా రాదు అంటే- ‘‘్ఫర్వాలేదు.. వాళ్లు ఇచ్చే పైసలుకన్నా నా నాలుగు రోజుల జీతం చాలా తక్కువ అంది. పైగా పని పోతే ఇంకో ఇల్లు వెతుక్కుంటా, నాకేం..!’’ అంది ధీమాగా. ఇక్కడ ముందు ఎవరు మారాలి? ఓటరా?? నాయకుడా? వ్యవస్థా? అసలు చట్టాన్ని కానీ, నిబంధనలని కానీ పాటించాలనే తపన ఎంతమందికి ఉంది? ఒక నిబంధన మనకు అనుకూలంగా లేకపోతే, దానివల్ల పొందే లాభం లేకపోతే ఆ నిబంధనని ఉల్లంఘించడానికి అందరం ముందే ఉంటాం. మాటల్లో చెప్పే నీతి చేతల్లో చూపలేని వారెందరో. అలాగే, తాము చేసేది ప్రజాసేవ అని మనలను నమ్మించేవారు ఎందరో. ఎవరి సమస్యలు వారివి, ఎవరి చెల్లుబాటు వారిది. ఇదే సమస్యకు మూలకారణం అని చెప్పలేం. సమస్యకు ఇదే పరిష్కారం అనీ చెప్పలేము. మొత్తంగా మనం తీసుకున్న గోతిలో మనమే పడి లేవలేక, లేపేవారిని కూడా అందులోకి లాగి అందులోనే కొట్టుకుంటున్నాము. ప్రతి మనిషీ పరిపూర్ణంగా మారిన రోజు మన వ్యవస్థ కూడా మారుతుంది.
దట్టమైన అడవిలో దొడ్డిదారులెన్నో, కాదీ ముందు ఏది అంటే కనుక్కోవటం కొంచెం కష్టమే. రహదారి కనుక్కోవటమే కష్టం, మరి అసలైన దొడ్డిదారి ఎలా కనుక్కోవటం? రాజకీయాలలో దారిని కనుక్కోవటం కూడా అంతే కష్టం. వ్యవస్థే మనిషిని విడదీసి వేరుగా చూస్తుంటే ఇక మనిషి మరో మనిషిని తోడుగా ఎలా చూస్తాడు? మనిషికి మనిషికి అడ్డుగోడ ఈ వ్యవస్థే! వ్యవస్థని మార్చాలని ప్రయత్నించి మనిషి మారిపోతున్నాడు. మనిషిని మార్చాలని తాపత్రయపడి వ్యవస్థ మారిపోతుంది. మనిషి, వ్యవస్థ ఒకేలా ఆలోచించి రెండూ కలిసి పని చేయాల్సింది పోయి విడివిడిగా ఆలోచిస్తూ కలిసి ఓడిపోతున్నాయి.
దయలేని దరిద్రం రమ్మని పిలుస్తుంటే ఎవరికి మాత్రం ఇష్టం? ప్రతీది డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు, దళారీలు నడుపుతున్న దందాలకు మంచితనం, మానవత్వం, నీతి, నిజాయితీ దాసోహం అంటున్నాయి. అడ్డదారులే దొడ్డిదారులే రహ దారులుగా చెలామణి అవుతున్నాయి, రాజ్యమే లు తున్నాయి. కోడిపిల్ల ముందా? గుడ్డు ముందా? అంటే చెప్పడం ఎంత కష్టమో అలాగే ముందు సగటు మనిషి మారాలా వ్యవస్థ మారాలా అంటే చెప్పడం కూడా అంతే కష్టం. ఒక మహా సముద్రం ఎక్కడ ఎలా పుట్టిందో, దాని లోతు ఎంతో మన నిపుణులు తేల్చగలరేమో గాని సమాజానికి చేటు చేసే తప్పు, నిర్లక్ష్యం, ఎపుడు ఎక్కడ మొదలయ్యాయో మాత్రం చెప్పలేరు. ‘మేము మారితే సరిపోతుందా? మిగతావారి సంగతేంట’ని ప్రశ్నించేవారే గానీ ఒక తప్పుని ప్రశ్నిం చేవారు తక్కువ, తప్పుకుని తిరిగేవారే ఎక్కువ. తాను కోల్పోయిందే పక్కవారూ కోల్పోవాలి, తాను పొందింది మాత్రం పక్కవారికి దక్కకూడదు అనే స్వార్థపూరిత ధోరణి మారనంతవరకు మనమింతేనా..?