Tuesday, November 12, 2013

My Article "Jorugaa Hushaarugaa Saagipodamaa...!" published in Today's (12.11.13) Andhrabhoomi Daily in Bhoomika~~ Rani Sandhya

To Read Online follow this Link : http://www.andhrabhoomi.net/content/j-63


జోరుగా..హుషారుగా సాగిపోదమా..

  • -రాణి సంధ్య
  • 12/11/2013
మెట్రో రైలుపుణ్యమా అని కాల చక్రం తిరుగుతూ తిరుగుతూ తొక్కుడుబండికి కలిసొచ్చే కాలాన్ని తీసుకొచ్చినట్టుంది! ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు, ముఖ్యంగా తాతయ్యలు నాన్నలు విశేషంగా చెప్పుకుంటుంటారు ‘మా రోజుల్లో మా ఊరి నుంచి పక్క ఊరి బడికి లేదా చుట్టుపక్కల నలభయ్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి సైకిల్ తొక్కుతూ వెళ్లివచ్చేవాళ్లం’’ అని. ఇప్పటితరం కార్లలో తిరగడం ఎంత గొప్ప అనుభవంగా భావిస్తున్నారో వెనకటి తరం వారు సైకిల్ తొక్కడం కూడా అంత గొప్ప అనుభవంగా భావిస్తారు. రోడ్లుకూడా సరిగా లేనప్పుడు సైకిల్‌పై ఏకంగా ఊర్లే తిరిగినవారు, నేడు కార్లలో తిరిగి కూడా ఆ రోజుల్లో సైకిల్‌పై తిరిగిన ఆ మజానే వేరు అని చెప్పుకుంటారు. ఆ కాలం వారు ఏ వయస్సులో చేయాల్సిన ముచ్చట్లు ఆ వయసులో చేసారు. వాటిని పదిలంగా దాచుకున్నారు. ఇప్పటి పిల్లలకు సైకిల్ తొక్కడం అంటేనే ఒక బాధ, భయము. మన రోడ్లు, వాహనాల రద్దీ చూసి తల్లిదండ్రులు కూడా పిల్లలకు సైకిల్ ఇవ్వడంపై ఎక్కువ మక్కు చూపించడంలేదు. వారు వీరు, వీరు వారు అయ్యారు అని ఊరికే అనలేదు పెద్దలు. పిల్లలకు సైకిల్ స్థానంలో బుల్లికార్లు వచ్చేసాయి. ఇక యుక్తవయస్సు వారు, నడి వయస్కులు సైకిల్ తొక్కే రోజులు వచ్చేసాయి.
ఈ వాహనాల రద్దీ, కాలుష్యం తప్పించుకోవడానికి, అలాగే ఇంధనాన్ని పొదుపు చేయడానికి ముఖ్యంగా ఐటి నిపుణులు సమయాన్ని, డబ్బుని ఆదా చేయడానికి, ప్రయాణ వ్యయ ప్రయాసలు తగ్గించుకోవటానికి మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. మరి వారు స్టేషన్లో రైలు బండి దిగగానే ఉద్యోగ స్థలానికి వెళ్లాలన్నా తిరిగి రైలు స్టేషన్‌కి రావాలన్నా మళ్లీ ఏ ఆటోనో ఆశ్రయించాలి.
నిజంగా ఇది చాలా మంచి ప్రయత్నం అనే చెప్పాలి. అందరూ ఇష్టపడతారని చెప్పలేము. అలాగే కొందరికి ఇష్టం ఉన్నా వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సైకిల్ తొక్కలేకపోవచ్చు. ఉద్యోగం అనగానే ఒక దర్జా, ఒక అధికార దర్పం ఉంటుంది. మరి సైకిల్ తొక్కుతూ ఉద్యోగానికి వెళ్లటం అంటే కొంతమందికి నామూషిగా కూడా అనిపించవచ్చు. కార్ పూలింగ్ అనే ఒక పద్ధతి ఎప్పటినుంచోన్నా, ఆది ఆచరణలో ఎవరూ పెట్టలేదు, ఆసక్తి చూపలేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో వాహనం. ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు వాహనాలు తప్పని పరిస్థితి. మరి రోడ్డుపై వాహనాల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి అవసరాన్ని మించిపోయి భరించలేని సమస్యగా తయారయింది. వాహనాల రద్దీ కాలుష్యం వెదజల్లుతూ ఆరోగ్యంతోబాటు సమయాన్ని, సహనాన్ని, డబ్బుని హరించి వేస్తుంది. ఇది విపరీత పరిస్థితుల్ని స్పృశించి ప్రమాదాలకు దారితీస్తుంది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చౌకగా ఉద్యోగస్తుల సౌకర్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), హైదరాబాద్ బైసికిలింగ్ క్లబ్ (హెచ్‌బిసి) సంయుక్తంగా గచ్చిబౌలిలో సెప్టెంబర్ 28, 2013న బైక్ స్టేషన్‌ని ఆరంభించారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక బైక్ స్టేషన్ భవనాన్ని నిర్మించగా, హైదరాబాద్ బైసికిలింగ్ క్లబ్ (హెచ్‌బిసి) ఈ స్టేషన్‌ని ఎటువంటి లాభాన్ని ఆశించకుండా నిర్వహించడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్)వారు 300 బైసికిళ్లు తమ వంతు సాయంగా అందించారు. అలాగే ఎపి ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేష్ వారు ఐటి కంపెనీ జోన్ల కోసం మొత్తం 60 కి.మీ సైకిల్ ట్రాక్‌ని, సైకిళ్లు తొక్కటానికి ఎనిమిది ట్రాక్‌లుగా రూపొందించి, 40 కి.మీ ట్రాక్‌ని ఉచితంగా నిర్మించి వారి తోడ్పటుని అందిస్తున్నారు.
ముందుముందు ఈ బైక్ స్టేషన్లో అన్ని హంగులు ఉంటాయి. ప్రతి మెట్రో రైలు స్టేషన్‌లో ఒక బైకు స్టేషన్ నిర్వహించేలా, అలాగే ఏ స్టేషన్లోనైనా సైకిలు తీసుకుని, ఏ స్టేషన్లోనైనా తిరిగి ఇచ్చే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. సైకిళ్లు తీసుకోవడానికి కార్డ్ స్వైపింగ్ టెక్నాలజీ, రెస్ట్‌రూములు, ఛేంజింగ్ రూములు, ఫుడ్ కోర్టులు, ఇంకా ఎన్నో సదుపాయాలను ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వీలు కల్పిస్తున్నారు. ప్రయాణీకులు రైలుబండి దిగగానే అక్కడ బైకు స్టేషన్లోకి సైకిలు అద్దెకు తీసుకుని ఉద్యోగ స్థలానికి వెళ్లి తిరిగి రైలు స్టేషన్‌కి రాగానే సైకిలు తిరిగి ఇచ్చేసి రైలు ఎక్కి వెళ్లిపోవచ్చు.
ఈ బైక్ స్టేషన్లు ఇరవై నాలుగు గంటలు, ఏడు రోజు పనిచేస్తాయి. ప్రయాణికుల సహాయం, రక్షణ కోసం మంచి అనుభవజ్ఞులైన సుశిక్షితమైన సిబ్బందిని నియమిస్తారు.
వినడానికి చాలా బాగుంది, ఆదాతోబాటు ఆరోగ్యం అందరికీ. ఇలాంటి ప్రయోగాలకి అందరూ చేయూతనిచ్చి ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇవ్వాలి. మన వంతు బాధ్యతగా కాలుష్యాన్ని, ఇంధనాన్ని, వాహన రద్దీని అదుపు చేయాలి, పొదుపు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్పు చాలా అవసరం. అయితే మగవారైతే త్వరగానే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. మరి మహిళలు ముఖ్యంగా మధ్య వయస్కులు, చీరలు ధరించే అలవాటు ఉన్నవారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఐతే ఐటి ఉద్యోగస్తులకి ఎక్కువగా షిఫ్టులు ఉంటాయి కాబట్టి, రాత్రిళ్ళు ప్రయాణించేవారికి కాస్త ప్రమాదం అనే చెప్పాలి. కార్లో వెళ్తున్నా అమ్మాయిలకు భద్రత లేనప్పుడు ఈ సైకిల్ ప్రయాణం ఎంతవరకు సురక్షితమో చెప్పలేము. వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు అందరితో కలిసి ఉండేలా చూసుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న సమస్యలని పక్కన పెడితే, ఈ బైసికిల్ స్టేషన్ నిజంగా చాలామందికి వరం అనే చెప్పాలి. ఇక ఉద్యోగస్తులైన యువతకైతే రోజూ ఒక పండుగ అనే అనుకోవాలి. అందరూ కలిసిమెలిసి సైకిల్ తొక్కుతూ హుషారుగా ఆడుతూ పాడుతూ వెళ్ళే అవకాశం. చెలిమికి, సరదాకి ఎక్కువ ఆస్కారం ఈ ప్రయాణం. దారిలో వెళ్ళే బాటసారుల కళ్లకి మంచి ఆహ్లాదం, వినోదం, ఆనందం. డాక్టర్లు రోజూ టీవీల్లో చెప్తున్నారు, సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. చాలామంది అసలు సైకిల్ తొక్కడానికి మంచి రోడ్లేవి, పచ్చని వాతావరణం ఎక్కడుంది అని బాధపడుతుంటారు. ఈ విధంనైనా అలాంటివారికి మంచి అవకాశం అని ఆశిద్దాం.